టీడీపీ కార్యకర్తలకు సామూహిక జన్మదిన వేడుకలు
ABN , Publish Date - May 11 , 2026 | 05:11 AM
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి, కష్టం ఫలితంగానే తాను ఈ రోజు మంత్రి హోదాలో ఉన్నానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు.
టీజీ భరత్ సమక్షంలో ఒకేరోజు నలుగురికి నిర్వహణ
కర్నూలు, మే 10(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి, కష్టం ఫలితంగానే తాను ఈ రోజు మంత్రి హోదాలో ఉన్నానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. అందుకే వారికోసం ఈ నెల 1 నుంచి ‘టీడీపీ కార్యకర్తల సామూహిక జన్మదిన వేడుకలు’ అనే వినూత్న కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. బూత్ ఇన్చార్జిల పుట్టిన రోజు వివరాలు ముందే తెలుసుకొని, ఆ రోజు ఎంతమంది ఉంటే వారందరికీ సామూహికంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కర్నూలు నియోజకవర్గం పరిధిలో మే 10న టీడీపీ 56, 89, 122, 129 బూత్ ఇన్చార్జిలు రాము, జ్యోతి, శ్యామ్, షేక్ షోహరాబ్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం నగరంలోని ‘మౌర్యఇన్’లో వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి కుటుంబ సభ్యులందరికీ విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. కార్యకర్తలకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీకి కార్యకర్తలే జీవనాడులని, వైసీపీ హయాంలో ఆ పార్టీ దౌర్జన్యాలు, అక్రమ కేసులకు భయపడకుండా వారు సమష్టిగా నిలబడడం వల్లే మళ్లీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.