కార్యకర్తే.. అధినేత!
ABN , Publish Date - May 28 , 2026 | 04:36 AM
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా, బడుగు, బలహీనవర్గాల వారి ఆశయాలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ.’’ అని బీసీ సంక్షేమ మంత్రి సవిత కొనియాడారు.
మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి సవిత
అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా, బడుగు, బలహీనవర్గాల వారి ఆశయాలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ.’’ అని బీసీ సంక్షేమ మంత్రి సవిత కొనియాడారు. మంగళగిరిలో ప్రారంభమైన మహానాడులో ‘కార్యకర్తే-అధినేత’ తీర్మానాన్ని ఆమె ప్రవేశ పెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గౌరవం, ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు నడవడం టీడీపీ సిద్ధాంతమన్నారు. జెండా మోసిన కార్యకర్తలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, రాజకీయాల్లో ప్రోత్సహిస్తామని యువనేత లోకేశ్ హామీ ఇచ్చారన్నారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను ఇవ్వనున్నట్లు ప్రకటించిన లోకేశ్కు ధన్యవాదాలు తెలిపారు. తీర్మానాన్ని బలపరుస్తూ పలువురు నాయకులు ప్రసంగించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ. షరీఫ్ అన్నారు. మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష మాట్లాడుతూ.. గత 11 ఏళ్లలో ప్రమాద బీమా కింద కార్యకర్తలకు, వారి కుటుంబాలకు రూ.155 కోట్లు అందించినట్టు చెప్పారు. క్షేత్రస్థాయి కార్యక్రమాలు, ఫొటోలను ‘మై టీడీపీ యాప్’లో నమోదు చేయడం ద్వారా కార్యకర్తల శ్రమకు డిజిటల్గా గుర్తింపు లభిస్తోందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏడు పదుల వయసులోనూ బాబు నిత్య విద్యార్థిలా నిరంతరం అధ్యయనం చేస్తుంటారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు. అండమాన్లో చంద్రబాబు ఒకసారి పర్యటించాలని అండమాన్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యం యాదవ్ కోరారు. కొందరు స్వార్థపరులు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి కష్టపడే వాళ్ల జీవితాల్లో మన్నుపోశారని తెలంగాణ నేత బక్కని నరసింహులు అన్నారు.