సిక్కోలు కాదు.. సింహపురిలో!
ABN , Publish Date - May 01 , 2026 | 03:53 AM
పసుపు పండుగ వేదిక నెల్లూరుకు మారింది. 44వ మహానాడును ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం చెంతనే ఉన్న చాపురం వద్ద అనువైన స్థలాన్ని కూడా గుర్తించారు.
మారిన మహానాడు వేదిక
అమరావతి/నెల్లూరు, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పసుపు పండుగ వేదిక నెల్లూరుకు మారింది. 44వ మహానాడును ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం చెంతనే ఉన్న చాపురం వద్ద అనువైన స్థలాన్ని కూడా గుర్తించారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు.. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే పార్టీ శ్రేణులకు వసతికి తగిన సౌకర్యం లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వేదిక ఖరారుకు పార్టీ పెద్దలు తర్జనభర్జన పడ్డారు. మరోవైపు.. భోగాపురంలో ముస్తాబవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జూన్ లేదా జూలైలో ప్రధాని మోదీ రానున్నారు. ఆ సమయంలో భోగాపురంలో భారీ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఒకే ప్రాంతంలో రెండు భారీ సభలు నిర్వహించడం కంటే.. ఇతర ప్రాంతాలకు అవకాశమివ్వాలని నాయకత్వం భావించింది. గురువారం పార్టీ నేతలతో సీఎం నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో మహానాడు వేదికను మార్చాలని నిర్ణయించారు. నెల్లూరుకు పచ్చజెండా ఊపారు. రాష్ట్ర పార్టీ పరిశీలకులు శుక్రవారం స్థల పరిశీలన జరుపనున్నారు.