Share News

మహానాడు వేదికపై 17న తుది నిర్ణయం

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:54 AM

మహానాడు వేదికను ఈ నెల 17న ఖరారు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ నిర్ణయించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన..

మహానాడు వేదికపై 17న తుది నిర్ణయం

  • టీడీపీ నేతలతో చర్చించిన లోకేశ్‌

  • జాతీయ, రాష్ట్ర కమిటీలు, పొలిట్‌బ్యూరో సభ్యులు దాదాపు ఖరారు

  • ఏ ఆత్మ చెప్పిందో జగన్‌ ‘మావిగన్‌’ అని కలవరిస్తున్నారు: లోకేశ్‌

అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): మహానాడు వేదికను ఈ నెల 17న ఖరారు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ నిర్ణయించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుపాటు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా రణస్థలం, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ప్రాంతాలను మహానాడు స్థల ఎంపిక కమిటీ పరిశీలించి వచ్చింది. వాటిని మరోసారి పరిశీలించి శుక్రవారం వేదికను ప్రకటించనున్నారు. అలాగే మహానాడులోపు పార్టీ రాష్ట్ర కమిటీని కూడా పూర్తి చేయాలని లోకేశ్‌ భావిస్తున్నారు. జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులను దాదాపు ఖరారు చేసినా.. మరోసారి వారి నేపథ్యాన్ని నిశితంగా పరిశీలించి ప్రకటించాలని పార్టీ నేతలకు సూచించారు.

పార్టీ సిద్ధాంతాలే బలం

పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలమని, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని లోకేశ్‌ స్పష్టం చేశారు. టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జుల శిక్షణ తరగతుల్లో భాగంగా నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే కాదు.. వాటి వెనుక ఉన్న టీడీపీ సిద్ధాంతాలను వివరించడం కూడా ఎంతో ముఖ్యం. కార్యకర్తల్లో ఐక్యత, క్రమశిక్షణ ఉంటే పార్టీ మరింత బలపడుతుంది. కూటమి నేతల మధ్యే కాదు.. కార్యకర్తల నడుమ కూడా సఖ్యత ముఖ్యం. ఏ సమస్య ఉన్నా కూటమి నాయకులు కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి’ అని సూచించారు. వైసీపీ విధ్వంసాల నుంచి సమాజాన్ని రక్షించేందుకే తాను రెడ్‌బుక్‌ను తీసుకొచ్చానని లోకేశ్‌ చెప్పారు. రాజారెడ్డి రాజ్యాంగంతో జగన్‌ సమాజాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని.. ఏ ఆత్మ చెప్పిందో ‘మావిగన్‌’ అంటూ కలవరిస్తున్నారని ఎద్దేవాచేశారు.

Updated Date - Apr 15 , 2026 | 05:56 AM