బాబాయ్ హత్యపై తడబాటెందుకు జగన్?
ABN , Publish Date - May 24 , 2026 | 03:59 AM
జగన్ తనను తాను మంచివాడికి చెప్పుకోవడాన్ని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్, గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్... అహింసావాదిగా చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
అబద్ధం, అరాచకమే నీ సిద్ధాంతం: టీడీపీ నేతలు
హత్యా రాజకీయాలకు చిరునామావి... గొడ్డలి పార్టీకి అధ్యక్షుడివి...
అహింసావాదినని చెప్పుకోవడం హాస్యాస్పదం
జగన్పై మండిపడ్డ పల్లా, అనగాని, సానా, భూమిరెడ్డి
అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): జగన్ తనను తాను మంచివాడికి చెప్పుకోవడాన్ని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్, గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్... అహింసావాదిగా చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విడివిగా ప్రకటనలు చేశారు. ‘అబద్ధం, అరాచకమే జగన్ రాజకీయ సిద్ధాంతం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే 3నెలలకోసారి బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్మీట్లు పెడుతుంటాడు. అధికారంలో ఉన్న ఐదేళ్లు.. కక్ష సాధింపులు, శవ రాజకీయాలు తప్ప సాధించింది ఏమీ లేదు. అందుకే 2024లో ప్రజలు ఆయన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. 2029లో జగన్కు ప్రజలు శాశ్వత రాజకీయ సన్యాసం ఇవ్వడం ఖాయం. బాబాయ్ హత్య కేసుపై జగన్ వైఖరిలో తడబాటును ప్రజలు గమనిస్తున్నారు. తొలి నుంచీ శవ రాజకీయాలు వైఎస్ కుటుంబానికి అలవాటే. తండ్రి శవాన్ని ఎదురుగా పెట్టుకుని రాజకీయాలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదే’ అని పల్లా మండిపడ్డారు. ‘వైఎస్ కుటుంబ చరిత్ర ఏమిటనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. వైఎస్ కుటుంబం ఎన్ని దారుణాలు చేసిందో సీమలో ఏ గడపని అడిగినా చెబుతుంది. రాజారెడ్డి రాజ్యాంగం గురించి ఎవరిని అడిగినా కథలు కథలుగా చెబుతారు.
అటువంటి రాజారెడ్డి పోలికలు నాకొచ్చాయి అని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు కావడంలో వింతేమీ లేదు. ఎస్సీ, ఎస్టీలపై అరాచకాలు చేసి, హత్యలు చేసి వాళ్ల చేతే దొంగతనాలు చేయించిన చరిత్ర వైఎస్ కుటుంబానిది’ అని మంత్రి అనగాని ఆరోపించారు. ‘వంగవీటి రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రాజకీయంగా ప్రోత్సహించడం ఏ విధమైన నైతికత? రంగా హత్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డికి ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చి ప్రోత్సహించిన జగన్కు రంగా హత్య గురించి మాట్లాడే అర్హత లేదు. రంగా పేరును ఓ వైపు రాజకీయ అవసరాలకు వాడుకుంటూ.. మరోవైపు రంగా హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారిని ప్రోత్సహించడం జగన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం’ అని సానా సతీశ్ మండిపడ్డారు. ‘నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించడానికి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్, ఆయన మీడియా కుట్రలు చేస్తోంది. డీఎస్సీ విజయవంతంగా పూర్తయి, ఎంపికైన వారంతా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటుంటే అందులో అక్రమాలు జరిగాయని జగన్, ఆయన మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోంది. వైసీపీ అక్రమాల ఫలితంగా ఉద్యోగాలు పొందిన వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారి దుస్థితికి కారణమైన జగన్కు డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదు’ అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.