రఘురామ నుంచి నాకు ప్రాణహాని
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:51 AM
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నుంచి తెలుగుదేశం పార్టీని రక్షించాలంటూ ఉండి నియోజకవర్గం నేత డిమాండ్ చేశారు.
ఆయన్ను సస్పెండ్ చేసి పార్టీని రక్షించండి
అసెంబ్లీ గేటు వద్ద ‘ఉండి’ టీడీపీ నేత నిరసన
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నుంచి తెలుగుదేశం పార్టీని రక్షించాలంటూ ఉండి నియోజకవర్గం నేత డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ గేటు బయట ఎన్టీఆర్ విగ్రహాన్ని చేతబట్టి ఆయన నిరసనకు దిగారు. తన పేరు వెంకటేశ్వరరాజు అని, ఉండి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతనని చెప్పిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నా. స్థానిక ఎమ్మెల్యే టీడీపీ నాయకుల్ని, అభిమానుల్ని హీనంగా చూస్తున్నారు. సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపు చర్యలకు దిగారు. నా ఇల్లు, కార్యాలయాన్ని ధ్వంసం చేయించారు. నన్ను పోలీసులతో కొట్టించారు. పార్టీని నమ్ముకున్నందుకు ఇచ్చే బహుమతి ఇదేనా..! నియోజకవర్గంలో టీడీపీని రక్షించాలంటే పార్టీ నుంచి రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలి. నాకు ఆయన నుంచి ప్రాణహాని ఉంది. నాకు, నియోజకవర్గంలో పార్టీకి జరుగుతున్న అన్యాయాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పడానికే ఇక్కడికి వచ్చా’ అని వెంకటేశ్వరరాజు చెప్పారు.