ఈడీ దర్యాప్తుతో గొడ్డలి పార్టీ అవినీతి పునాదులు కదులుతున్నాయి
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:37 AM
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చాక చేసిన పనులకు అసలు పొంతనే లేదని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ అన్నారు.
‘సిట్’ నిర్ధారణ నూరు శాతం నిజమని తేలింది
అంతిమ లబ్ధిదారుడెవరో దర్యాప్తుల్లో తేలడం ఖాయం: మద్దిపట్ల సూర్యప్రకాశ్
అమరావతి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చాక చేసిన పనులకు అసలు పొంతనే లేదని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014-19 మధ్య పాదయాత్ర చేసిన సమయంలో దారి పొడవునా ఊరికొక మోసం, పూటకొక అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్, వైసీపీ నాయకులు ఇచ్చే బిల్డ్పలు చూసి జనం నవ్వుకుంటున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు నాసిరకం మద్యంతో గొడ్డలి పార్టీ సాగించిన దోపిడీ, అవినీతి సామ్రాజ్యం పునాదులు ఇప్పుడు ఈడీ దర్యాప్తుతో కదులుతున్నాయి. నాసిరకం మద్యం కుంభకోణం విలువ రూ.3500 కోట్లు అని సిట్ చేసిన నిర్ధారణ వంద శాతం కరెక్ట్ అని ఈడీ దర్యాప్తులో కూడా తేలింది. సామాన్య ప్రజలు తమ పిల్లల పెళ్లిళ్ల కోసమో ఇతర శుభకార్యాల కోసమో తులం, అర తులం బంగారం కొనాలన్నా ఎంతో కష్టపడతారు. అలాంటిది గత వైసీపీ పాలకులు మద్యం అవినీతి సొమ్ముతో ఏకంగా వందల కిలోల బంగారం కొనుగోలు చేశారు. ఆ వందల కిలోలు ఎక్కడకి వెళ్లిందనేది ఈడీ విచారణలో తేలుతుంది. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఈడీ, సిట్ దర్యాప్తుల్లో తేలడం ఖాయం’ అని మద్దిపట్ల పేర్కొన్నారు.