ఏ లోటూ రానివ్వం...మహానాడుకు తరలిరండి!!
ABN , Publish Date - May 14 , 2026 | 05:23 AM
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ప్రతి సంవత్సరం మహానాడు జరుగుతూనే ఉంది. అయితే వాటికి ఈ నెల 27 నుంచి 29 వరకు నెల్లూరులో జరగబోయే మహానాడుకూ తేడా ఉంది
టీడీపీ శ్రేణులు, అభిమానులకు రాష్ట్ర పార్టీ ఆహ్వానం
సభల నిర్వహణపై కమిటీలతో నేతల చర్చ
నెల్లూరు, మే 13(ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ప్రతి సంవత్సరం మహానాడు జరుగుతూనే ఉంది. అయితే వాటికి ఈ నెల 27 నుంచి 29 వరకు నెల్లూరులో జరగబోయే మహానాడుకూ తేడా ఉంది. ఇది యువ నాయకుడు లోకేశ్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిండెంట్గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు. చరిత్రలో ఇది నిలిచిపోయేలా నిర్వహిస్తాం. ఈ మూడు రోజుల తెలుగు పండుగకు లక్షలాదిగా తరలిరండి’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ తదితరులు పిలుపునిచ్చారు. సభల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం మహానాడు ప్రాంగణం ఇఫ్కో కిసాన్ సెజ్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షతన మహానాడు నిర్వహణ కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో రాష్ట్ర నాయకులు సమీక్ష నిర్వహించారు. 19 నిర్వహణ కమిటీలకు చెందిన ముఖ్యులతోపాటు పలువురు మంత్రులు, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నెల్లూరు మహానాడు చరిత్రలో నిలిచిపోయేంత ఘనంగా నిర్వహించాలన్నారు. మహానాడు ఏర్పాట్లపై రాష్ట్ర పార్టీ నాయకులు... మంత్రులు నారాయణ, ఆనం, రాంప్రసాద్రెడ్డి, అనగాని, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్రెడ్డి, ఫరూక్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లతో విడిగా సమావేశమై చర్చించారు.