ప్రారంభోత్సవం కోసం టీసీఎస్ ఎదురుచూపు
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:01 AM
విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యాలయం ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తోంది.
ఇప్పటికే విశాఖలో మొదలైన కార్యకలాపాలు
రోజూ విధులకు 200 మంది ఉద్యోగుల హాజరు
లాంఛనంగా ప్రారంభోత్సవమే తరువాయి
విశాఖపట్నం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యాలయం ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తోంది. ఇది లాంఛనం మాత్రమే. ఇప్పటికే 200 మంది వరకు ఉద్యోగులు వారి ప్రాజెక్టు పనులపై రోజూ ఆఫీసుకు హాజరవుతున్నారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్-3పై మిలీనియం టవర్ల (1, 2)లో సుమారుగా పది అంతస్థులు టీసీఎస్కు కేటాయించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి ఉద్యోగులను ఇక్కడకు పంపుతున్నారు. విశాఖలో ఉంటూ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేస్తున్న వారు సమావేశాల కోసం ఇక్కడికి వస్తున్నారు. విశాఖ క్యాంపస్ కోసం కొద్దిరోజుల క్రితం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. టీసీఎస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు సమయం ఇస్తే.. ముహూర్తం పెట్టుకొని ఆ రోజున లాంఛనంగా ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా హిల్-3పై శాశ్వత క్యాంపస్ నిర్మాణం కోసం 21.16 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అక్కడ శంకుస్థాపన కూడా చేయాల్సి ఉంది.