పాఠశాలలకు స్వచ్ఛరథం.. ప్రతి గురువారం స్కూల్ డ్రైవ్ డే
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:44 AM
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథం ఇప్పుడు గ్రామాల్లోని పాఠశాలలకు విస్తరిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన ...
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథం ఇప్పుడు గ్రామాల్లోని పాఠశాలలకు విస్తరిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 531 మండలాల్లోని 531 పాఠశాలల్లో ప్రతి గురువారం ప్రత్యేక స్కూల్ డ్రైవ్ డేగా చేపడుతున్నారు. పాఠశాలల వద్ద వేస్ట్ పేపర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర పనికిరాని వస్తువులను సేకరించి పిల్లలకు అవసరమైన వస్తువులు సరఫరా చేసేందుకు మండలానికి ఒక పాఠశాలను ఎంపిక చేసి అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 531 స్కూళ్లలో వేస్ట్ మెటీరియల్ 1.07 లక్షల కేజీలు పోగయింది. ఈ వేస్ట్కు ప్రతిఫలంగా ఆయా స్కూళ్లకు రూ.11.96 లక్షలను స్వచ్ఛరథ నిర్వాహకులు అందించారు. ఈ సందర్భంగా పాత పుస్తకాలను పిల్లలు స్వచ్ఛ రథం వద్ద ఇచ్చి కొత్త పుస్తకాలు, స్టేషనరీ వస్తువులను పొందారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు పాఠశాలలో గురువారం 515 కేజీల వేస్ట్కు గాను అత్యధికంగా రూ.7480 అందజేశారు. ఇదే విధంగా కృష్ణా జిల్లా ఉంగుటూరు పాఠశాలలో 510 కేజీల వేస్ట్కు గాను రూ.5405, బాపట్ల జిల్లాలోని నగరం స్కూల్లో 501 కేజీలకు గాను రూ.7522 అందించి పిల్లల్లో స్వచ్ఛత స్పూర్తిని కల్పించారు.