నా భర్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపండి..!
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:55 AM
సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్కు చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను ఆపేయాలంటూ ఆయన భార్య పి అరుణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వాన్ని కోరిన పీవీ సునీల్ కుమార్ భార్య
నేడు పదవీ విరమణ.. అనుమతిస్తూ ఉత్తర్వు
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్కు చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను ఆపేయాలంటూ ఆయన భార్య పి అరుణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న పీవీ సునీల్ కుమార్ మంగళవారం (జూన్ 30న) రిటైర్ కానున్నారు. దాంపత్య జీవితంలో విభేదాల కారణంగా పీవీ సునీల్తో దూరంగా ఉంటోన్న అరుణ 2017 జూన్లో భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో పీవీ సునీల్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తే తన జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రంలో ఆమె వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ చీఫ్గా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సునీల్ కుమార్ అప్పటి ఎంపీ రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామరాజు ఫిర్యాదు మేరకు సునీల్పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఫైర్ డీజీగా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం ఆరోపణలు, ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లి రావడంపై క్రమశిక్షణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం సునీల్కుమార్ను సస్పెన్షన్లో ఉంచింది. ఆ విచారణ పూర్తి కానందున ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జూన్ 30న ఆయన పదవీ విరమణకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలు మాత్రం ఆయనపై ఉన్న ఆరోపణలపై వెలువడే తీర్పునకు అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేర ఉంటాయని సీఎస్ జీవోలో స్పష్టం చేశారు. కాగా, మరో సీనియర్ ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్ కూడా మంగళవారం రిటైర్ కానున్నారు.