ఆక్సిజన్ సిలిండర్తోనే పరీక్షకు..
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:52 AM
కృత్రిమంగా ఆక్సిజన్ అందితేనే ప్రాణం నిలబడుతుంది. దీంతో సిలిండర్ను పక్కనే ఉంచుకుని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు.
ఊపిరితిత్తులు పాడై చికిత్స పొందుతున్న కౌశిక్
ఆర్థిక స్థోమత లేక ఇంటి వద్దే అరకొర వైద్యం
కొత్తపట్నం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): కృత్రిమంగా ఆక్సిజన్ అందితేనే ప్రాణం నిలబడుతుంది. దీంతో సిలిండర్ను పక్కనే ఉంచుకుని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన కట్టా కౌశిక్చంద్ సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు ఆక్సిజన్ సిలిండర్తో హాజరయ్యాడు. కొత్తపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో కౌశిక్ పరీక్షలు రాస్తున్నాడు. పైపును ముక్కుకు తగిలించుకుని ఆక్సిజన్ తీసుకుంటూ తెలుగు పరీక్ష రాశాడు. 17 ఏళ్ల వయస్సు కలిగిన కౌశిక్కు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఊపిరితిత్తులు మార్పిడికి రూ.50 లక్షలకుపైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పటంతో అంత స్థోమత లేని అతని తల్లిదండ్రులు, ఇంటికి తీసుకొచ్చి తాత్కాలిక చికిత్స మాత్రమే చేయిస్తున్నారు. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కౌశిక్ ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు రాయాలని నిర్ణయించుకుని కష్టమైనా సరే బలమైన సంకల్పంతో, అధికారుల అనుమతి తీసుకుని ఆక్సిజన్ సిలిండర్ను పరీక్ష హాలులోకి తీసుకు వచ్చి రాస్తున్నాడు.