సిగరెట్ తాగొద్దన్నందుకు బడిలో ల్యాబ్ టెక్నీషియన్పై విద్యార్థి దాడి
ABN , Publish Date - Mar 05 , 2026 | 03:59 AM
పాఠశాలలో సిగరెట్ తాగొద్దని మందలించిన ల్యాబ్ టెక్నీషియన్పై పదో తరగతి విద్యార్థి పిడిగుద్దులతో దాడి చేశాడు. టెక్నీషియన్ గుండెలపై ....
కృష్ణాజిల్లా వీరవల్లి హైస్కూల్లో ఘటన
విజయవాడ/హనుమాన్జంక్షన్ రూరల్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): పాఠశాలలో సిగరెట్ తాగొద్దని మందలించిన ల్యాబ్ టెక్నీషియన్పై పదో తరగతి విద్యార్థి పిడిగుద్దులతో దాడి చేశాడు. టెక్నీషియన్ గుండెలపై బలంగా గుద్దడంతో ఆయన విలవిల్లాడారు. అయితే.. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థితో క్షమాపణలు చెప్పించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి హైస్కూల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. ఇంటర్వెల్లో వాష్ రూమ్లో పొగ తాగుతున్నట్టు ల్యాబ్ టెక్నీషియన్ గమనించారు. ఈ విషయం తెలిసి విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తరగతి గదికి వెళ్లిన టెక్నీషియన్ ఆ విద్యార్థులను మందలించారు. దీనిని అవమానంగా భావించిన ఒక విద్యార్థి తరగతి గదిలోనే టెక్నీషియన్ గుండెలపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, కొన్ని రోజుల్లోనే పదో తరగతి పరీక్షలు ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా విద్యార్థిని హెచ్చరించారు.