మందుబాబులకు అడ్డా
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:21 PM
చీకటి పడితే చాలు మందుబాబులు ప్రభుత్వ పాఠశాలలను, కార్యాలయం, మైదానాలను అడ్డాగా మార్చుకుంటున్నారు.
చీకటి పడితే ప్రభుత్వ పాఠశాలల
ఆవరణలో మందు, విందు
మద్యం బాటిళ్లు పగలగొడుతున్న
మందుబాబులు
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు,
ఉపాధ్యాయులు
ఆలూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): చీకటి పడితే చాలు మందుబాబులు ప్రభుత్వ పాఠశాలలను, కార్యాలయం, మైదానాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. మద్యం సేవించి అక్కడే మద్యం బాటిళ్లను పగలగొట్టి వెళ్తున్నారు. దీంతో ఉదయం పాఠశాలలకు వస్తున్న విద్యార్థులకు పగిలిన మద్యం బాటిల్ గాజు పెంకులు కుచ్చుకుని గాయాల పాలవుతున్నారు. అలాగే ఉదయం, రాత్రి అక్కడ వాకింగ్ చేసేందుకు వస్తున్న ఉద్యోగులు, వృద్ధులు, క్రీడాకారులు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల-1, 2తో పాటు ఎంఈవో కార్యాలయం, భవిత భవన్, కొత్త బస్టాండు వద్ద కూడా మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ఓపెన్ డ్రింక్పై నిఘా వేస్తూ ఫైన్లు వేస్తుండడంతో ఇక్కడ అయితే నిఘా ఉండదని భావించి మందు, విందులు చేస్తున్నారు. బర్త్ డే పార్టీలు కూడా ఇక్కడే జరుపుకుని పార్టీలు చేసుకుని వెళ్లడం గమనార్హం. రాత్రివేళల్లో ఉన్నత పాఠశాలలు, కార్యాలయాలకు భద్రత లేకుండా పోయింది. పోలీసులు దృష్టి సారించి మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.