శ్రీశైలంలో స్వాభిమాన్ పర్వ్
ABN , Publish Date - May 12 , 2026 | 05:08 AM
సోమనాథ్ ఆలయ 75 ఏళ్ల వారసత్వానికి ప్రతీకగా శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం స్వాభిమాన్ పర్వ్ ఉత్సవం ఘనంగా జరిగింది.
1008 కలశాలతో శోభాయాత్ర
శ్రీశైలం, మే 11 (ఆంధ్రజ్యోతి): సోమనాథ్ ఆలయ 75 ఏళ్ల వారసత్వానికి ప్రతీకగా శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం స్వాభిమాన్ పర్వ్ ఉత్సవం ఘనంగా జరిగింది. క్షేత్ర పరిధిలో రోజంతా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో 1008 కలశాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్త పూజలు జరిపించారు. శుద్ధ జలం, నారికేళం, మామిడితోరణాలతో అలంకరించిన కలశాలతో మహిళలు ప్రధానాలయం నుంచి బయలుదేరి గంగాధర మండపం, నందిమండపం, క్షేత్రపాలకుడు బయలు వీరభద్రుని ఆలయాల మీదుగా మల్లన్న సన్నిధి వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా భక్తుల శివనామస్మరణతో శ్రీశైల క్షేత్రం మార్మోగింది. శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు స్వామిఅమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.