శ్రీశైలం ఘాట్లో అదుపు తప్పిన బస్సులు
ABN , Publish Date - Apr 22 , 2026 | 06:08 AM
ఎదురుగా వస్తున్న వాహనాలకు దారివ్వబోయి వేగం కారణంగా అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. దాని వెనుకనే వస్తున్న ఇంద్ర బస్సు కూడా ఇనుప రెయిలింగ్ను ఢీకొట్టింది.
లోయలోకి దూసుకెళ్లి బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు
రెయిలింగ్ను ఢీకొట్టి నిలిచిన మరో బస్సు
పెద్ద దోర్నాల, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఎదురుగా వస్తున్న వాహనాలకు దారివ్వబోయి వేగం కారణంగా అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. దాని వెనుకనే వస్తున్న ఇంద్ర బస్సు కూడా ఇనుప రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ రెండు ఘటనలు శ్రీశైలం-దోర్నాల ఘాట్ రోడ్డులోని శ్రీఅభయాంజనేయస్వామి గుడి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచిదోర్నాల వైపు వస్తోంది. ఘాట్రోడ్డులో ఎదురొచ్చిన వాహనాలకు సైడిచ్చే క్రమంలో రోడ్డు మార్జిన్ దిగిం ది. అప్పటికే అక్కడ వర్షపు జల్లులుపడుతుండటంతోపాటు వేగం కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇనుప రిటైనింగ్ వాల్ను దాటి లోయలోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న 30మంది భయాందోళనతో కేకలు వేశారు. అయితే, ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద చెట్లు ఉండడంతో వాటిని ఢీకొట్టి బస్సు నిలిచిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అదే సమయంలో ఆ బస్సు వెనుకవస్తున్న ఇంద్ర బస్సు కూడా వేగం అదుపు కాక రోడ్డు పక్కన ఉన్న రక్షణ ఇనుప కమ్మీలను ఢీకొట్టి నిలిచిపోయింది. అందులో ఉన్న 12 మంది భయాందోళనకు గురయ్యారు.