గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:44 AM
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం వచ్చే నెల 2వ తేదీతో ముగియనుంది.
నియామక అధికారాలు కలెక్టర్లకు అప్పగింత
ఉత్తర్వులు జారీ
అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం వచ్చే నెల 2వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తిరిగి గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు ఆయా గ్రామ పంచాయతీల విధులు, అధికారాల వినియోగ బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రత్యేకాధికారులు లేదా పర్సన్ ఇన్చార్జిలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక అధికారులను లేదా పర్సన్ ఇన్చార్జిల నియామక అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు లేదా వీరి కంటే ఎక్కువ హోదా ఉన్న అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించ డానికి జిల్లా కలెక్టర్లకు అధికారం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.