11న 11 మంది 11 నిమిషాలు ఉండి పోయారుగా!
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:56 AM
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయనకు వీడ్కోలు పలికి తిరిగి వచ్చే సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు లాబీల్లో ఉన్న మీడియాను పలకరించారు.
వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సరదా వ్యాఖ్య
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయనకు వీడ్కోలు పలికి తిరిగి వచ్చే సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు లాబీల్లో ఉన్న మీడియాను పలకరించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు రావడంపై స్పందించాల్సిందిగా మీడియా కోరగా..ఏముంది 11న (బుధవారం) 11 మంది వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా.. అంతేనా.. అంతకు మించి ఏమైనా జరిగిందా ?’’ అని సరదాగా స్పీకర్ వ్యాఖ్యానించారు. సభ్యులు పార్టీల కతీతంగా సభా సంప్రదాయాలు పాటిస్తే బాగుంటుందన్నారు. అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్ మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలే బయోమెట్రిక్ వాడుతున్నారని, పార్లమెంటులో కూడా త్వరలో ఏఐ ఆధారిత అటెండెన్స్ తీసుకు రానున్నారని తెలిపారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహ ప్రవేశాలు చేయాలని భావిస్తున్నామన్నారు.