16న అండమాన్కు ‘నైరుతి’
ABN , Publish Date - May 14 , 2026 | 05:11 AM
నైరుతి బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బుధవారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ మధ్య...
విశాఖపట్నం, అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బుధవారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి తోడు హిందూ మహాసముద్రంలో గాలులు బలంగా వీస్తుండడంతో 16న నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకున్న నేపథ్యంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43-44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం అల్లూరి, పోలవరం జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల పరిధిలోని 143 మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా రాయలపూటలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. అక్కడక్కడా వర్షాలు పడగా, ఎక్కువచోట్ల ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు రానున్న రెండు రోజుల్లో మరింత పెరుగుతాయి.