రాష్ట్రానికి రాజధాని ఉండటం జగన్కు ఇష్టం లేదు: సోమిరెడ్డి
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:23 AM
రాష్ట్రానికి రాజధాని ఉండటం జగన్కు ఇష్టం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రాజధాని ఉండటం జగన్కు ఇష్టం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జాతీయ రహదారిపై రాజధానిని నిర్మించిన రాష్ట్రం దేశంలో ఒక్కటీ లేదు. కానీ, జగన్ మాత్రం హైవేపై నిర్మిస్తానని చెపుతున్నారు. ఇప్పటికే అమరావతిలో 50 వేల ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, జాతీయ బ్యాంకులు రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఇంత భారీ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పడుతున్న సమయంలో వాటన్నింటినీ కాదంటూ జగన్ బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదు. జగన్ లాంటి మారీచులు నుంచి అమరావతిని కాపాడుకునేందుకు పార్లమెంటు చట్టాన్ని చేయాల్సి వ చ్చింది. దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తే, సొంత రాష్ట్రానికి చెందిన వైసీపీ మాత్రం రాజధానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం హేయమైన చర్య. అమరావతి అంటే ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. రాష్ట్ర ప్రజలందరి ఉమ్మడి ఆస్తి’ అని సోమిరెడ్డి అన్నారు.