Share News

కల్యాణదుర్గంలో స్కై ఫ్యాక్టరీ!

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:09 AM

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. కల్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామ సమీపంలో 500 ఎకరాల్లో రూ.1,300 కోట్లతో ఎలక్ర్టిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌...

కల్యాణదుర్గంలో స్కై ఫ్యాక్టరీ!

  • ఎలక్ర్టిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌, ల్యాండింగ్‌ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు

  • 1,300 కోట్ల పెట్టుబడితో.. 500 ఎకరాల్లో.. సర్లా ఏవియేషన్‌ సంస్థ సన్నాహాలు

అనంతపురం జనవరి 20(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. కల్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామ సమీపంలో 500 ఎకరాల్లో రూ.1,300 కోట్లతో ఎలక్ర్టిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌, ల్యాండింగ్‌ (ఈవీటీవోఎల్‌) విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సర్లా ఏవియేషన్‌ ముందుకొచ్చింది. ఆ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు మంగళవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఈ విమానాల తయారీ కర్మాగారానికి స్కై ఫ్యాక్టరీగా నామకరణం చేశారు. ప్రాజెక్టు మొదటి దశలో 150 ఎకరాల్లో రూ.330 కోట్ల పెట్టుబడితో మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేస్తారు. 2029 నాటికి పూర్తిస్థాయిలో పరిశ్రమను నెలకొల్పాలని ఆ సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ పరిశ్రమ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఏడాదికి 1,000 ఎయిర్‌క్రా్‌ఫ్టలు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. దీనిద్వారా పట్టణ వాయు రవాణాకు ఒక పూర్తిస్థాయి వ్యవస్థను నెలకొల్పాలని ఆ కంపెనీ భావిస్తోంది. ఈ పరిశ్రమ క్యాంప్‌సలో అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు, ల్యాబ్‌లు, విమాన టెస్టింగ్‌ సౌకర్యాలు, 2 కిలోమీటర్ల పొడవైన రన్‌వేలు నిర్మించనున్నారు. ఇక్కడ పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించి సర్లా ఏవియేషన్‌ ఇప్పటికే బెంగుళూరులో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. ఈవీటీవోఎల్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టల తయారీ ద్వారా వాణిజ్య ఎయిర్‌ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరు సీట్లు ఉండే ఈ విమానాలు ఒకసారి చార్జింగ్‌ చేస్తే దాదాపు 160 కిలోమీటర్ల దూరం, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిద్వారా మెట్రో పాలిటన్‌ నగరాలు, విమానాశ్రయాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుంది.


చంద్రబాబు విజన్‌కు నిదర్శనం: ఎమ్మెల్యే అమిలినేని

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారని, ఆయన విజన్‌కు తిమ్మసముద్రంలో ఏర్పాటు చేయనున్న ఈవీటీవోఎల్‌ విమాన తయారీ కేంద్రం నిదర్శనమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఈ కర్మాగారం ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, దీనికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఇందులో అర్హత, నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Jan 21 , 2026 | 04:40 AM