ఫోన్లు ధ్వంసం చేసి..
ABN , Publish Date - May 31 , 2026 | 05:35 AM
మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్ఆర్ చిన్ననాటి స్నేహితుడు పుత్తా శంకర్ రెడ్డి పాత ఫోన్లు ధ్వంసం చేసి సిట్ విచారణకు హాజరయ్యాడు.
సిట్ అధికారుల విచారణకు పుత్తా శంకర్ రెడ్డి
కొత్త ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయానంటూ జవాబు
కేఎన్ఆర్కు బినామీ కాదంటూ బుకాయింపు
అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్ఆర్ చిన్ననాటి స్నేహితుడు పుత్తా శంకర్ రెడ్డి పాత ఫోన్లు ధ్వంసం చేసి సిట్ విచారణకు హాజరయ్యాడు. కొత్త ఫోన్ తీసుకెళ్లి అధికారులకు దొరికిపోయాడు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ సిట్ అధికారులు ప్రశ్నించారు. శంకర్ రెడ్డి చేతిలో ఉన్న కొత్త ఫోన్ను గమనించిన సిట్ అధికారులు.. ఫోన్ ఎందుకు మార్చేశావని ప్రశ్నించారు. ‘పాతది పాడైంది.. అందుకే కొత్తది కొనుక్కున్నా’ అని సమాధానం చెప్పాడు. ఫోన్లో ఏముందో చూద్దామంటూ సిట్ అధికారులు పదే పదే అడిగినా.. పాస్వర్డ్ గుర్తులేదంటూ ఫోన్ చేతికి ఇచ్చేందుకు శంకర్రెడ్డి ససేమిరా అన్నట్లు తెలిసింది. ‘నేను ఎవ్వరికీ బినామీ కాదు.. నాకు కేఎన్ఆర్ ఆస్తులు, ఆర్థిక లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదు’ అంటూ సిట్ విచారణలో అమాయకత్వం ప్రదర్శించినట్లు సమాచారం. విచారణలో ఏది అడిగినా అన్నింటికీ తెలీదంటూ సమాధానం చెప్పాడు. అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలు ముందుంచి ప్రశ్నించగా.. అకౌంటెంట్ చెబుతాడంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సోమవారం మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించినట్టు తెలిసింది.