వేట్లపాలెం ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:17 AM
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుళ్ల ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని సిట్ అధికారులు స్పష్టం చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్...
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతోనే ప్రమాదం
సిట్ అధికారుల బృందం స్పష్టీకరణ
సామర్లకోట, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుళ్ల ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని సిట్ అధికారులు స్పష్టం చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్, మరో అధికారి రవికృష్ణ మాట్లాడుతూ.. ‘‘గత ఫిబ్రవరి 28న వేట్లపాలెంలో బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన పేలుళ్ల ఘటనలో 28 మంది కూలీలు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సంఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఇక్కడికి వచ్చాం. ప్రమాదంలో చికిత్స పొంది తిరిగి మామూలు స్థితికి చేరుకున్న వారి నుంచి సమాచారాన్ని సేకరించాం. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక బాధితుడిని, ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న వ్యక్తిని కూడా విచారించాం. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, లేబర్ వెల్ఫేర్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ అధికారులను వేర్వేరుగా విచారించాం. బాణసంచా నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందనేది స్పష్టం అవుతోంది. నిర్వాహకులు ఏమాత్రం జాగ్రత్తలు పాటించలేనట్టు స్పష్టం అవుతోంది. మరింత అధ్యయనం చేసి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తాం’’ అని వారు వెల్లడించారు. ఈ పరిశీలనలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వభరత్ తదితరులు పాల్గొన్నారు.