కడపలోనూ కేఎన్ఆర్ ‘లింకులు’
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:19 AM
వందల కోట్ల అక్రమాస్తులు సంపాదించిన మాజీ సీఎం జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి(కేఎన్ఆర్) వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరింత లోతుగా విచారిస్తోంది.
అక్రమార్జన వ్యవహారంలో సిట్ విచారణ
వైవీయూ మాజీ పాలకమండలి సభ్యుడు,సూపర్మార్కెట్ నిర్వాహకుడిని ప్రశ్నించిన అధికారులు
కేఎన్ఆర్ బంధువులనూ విచారించే అవకాశం
కడప, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): వందల కోట్ల అక్రమాస్తులు సంపాదించిన మాజీ సీఎం జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి(కేఎన్ఆర్) వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరింత లోతుగా విచారిస్తోంది. ఆయనతో ఆర్థిక లావాదేవీలున్న పలువురిని సోమవారం కడపలో విచారించినట్టు సమాచారం. వైవీయూ మాజీ పాలకమండలి సభ్యుడు, రాజారెడ్డివీధిలోని ఓ సూపర్మార్కెట్ నిర్వాహకుడు, మరికొందరిని సిట్ సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తమ వద్ద ఉన్న ఆధారాలను ముందు పెట్టి కేఎన్ఆర్తో లావాదేవీలు, డబ్బుల వ్యవహారం గురించి ప్రశ్నించారని సమాచారం. ఇంకా కేఎన్ఆర్ బంధువులు, మరికొందరిని సిట్ విచారించనుంది. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణలో కేఎన్ఆర్ లింకులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇంకా ఆయన అక్రమాలు, అవినీతి బాగోతం బయటపడుతూనే ఉన్నాయి. విచారణలో భాగంగా ఇప్పటికే ఆయనతో ఆర్థిక లావాదేవీలు జరిపినవారిని, బినామీలుగా భావిస్తున్నవారిని సిట్ ప్రశ్నించింది. కేఎన్ఆర్ సొంతూరు కడప జిల్లా కమలాపురం. కడపలో కూడా ఆర్థిక వ్యవహారాలు ఉన్నట్లు గుర్తించిన సిట్ ఆ దిశగా దర్యాప్తు చేపట్టింది.