Guntur Court: ప్రేమ పేరుతో మోసం.. ఎస్ఐకు పదేళ్ల జైలు శిక్ష
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:15 AM
ప్రేమ పేరుతో యువతిని మోసగించిన కేసులో ఓ పోలీసు అధికారికి పదేళ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయాధికారి శరత్కుమార్ సోమవారం తీర్పు ఇచ్చారు.
గుంటూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో యువతిని మోసగించిన కేసులో ఓ పోలీసు అధికారికి పదేళ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయాధికారి శరత్కుమార్ సోమవారం తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం బాపట్ల జిల్లా అమృతలూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె.రవితేజ గతంలో గుంటూరు జిల్లా నగరంపాలెం ఎస్ఐగా పనిచేశారు. ఆ సమయంలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లు కేసు నమోదైంది. 2023లో ఎస్ఐ రవితేజపై ఆ యువతి నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు అత్యాచార కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ ఎస్ఐ విధులకు రాకపోవడంతో ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు. ఈ కేసుపై గుంటూరు కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. చివరకు ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడని నిర్ధారణకు వచ్చిన న్యాయస్థానం.. రవితేజకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.