Legal Action: శ్రేయ ఇన్ఫ్రా 51 ఎకరాల భూములు జప్తు
ABN , Publish Date - Jan 03 , 2026 | 06:46 AM
అధిక వడ్డీ ఆశ చూపి, ప్రజలను మోసగించిన కర్నూలుకు చెందిన శ్రేయ ఇన్ఫ్రా అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
కర్నూలు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): అధిక వడ్డీ ఆశ చూపి, ప్రజలను మోసగించిన కర్నూలుకు చెందిన శ్రేయ ఇన్ఫ్రా అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ సంస్థకు చెందిన 51.55 ఎకరాలు భూమిని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాలో ప్రజలను మోసం చేసి, దాదాపు రూ.206 కోట్లతో ఆ సంస్థ బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన కర్నూలు పోలీసులు.. ఆ కేసును సీఐడీకి అప్పగించారు. శ్రేయ సంస్థ నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో 51.55 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దాన్ని జప్తు చేయడానికి, దానిపై నియంత్రణకు అనుమతి ఇవ్వాలని సీఐడీ ప్రభుత్వానికి నివేదించింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం శ్రేయ ఇన్ఫ్రా సంస్థ భూమిని జప్తు చేసి, తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తాజాగా జీవో జారీ చేశారు. ఈ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ను ఆదేశించారు.