కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల!
ABN , Publish Date - May 27 , 2026 | 04:50 AM
ఏపీలో తన పదవీకాలం ముగియడంతో ఇప్పటి వరకూ రాజ్యసభలో వైసీపీ ఎంపీగా ఉన్న రిలయన్స్ ప్రతినిధి పరిమళ నత్వానీ మళ్లీ ఝార్ఖండ్ నుంచి రాజ్యసభకు...
మరోసారి పరిమళ నత్వానీ!
ఈసారి బీజేపీ తరఫున ఝార్ఖండ్ నుంచి బరిలోకి?
న్యూఢిల్లీ, మే 26 (ఆంధ్రజ్యోతి): ఏపీలో తన పదవీకాలం ముగియడంతో ఇప్పటి వరకూ రాజ్యసభలో వైసీపీ ఎంపీగా ఉన్న రిలయన్స్ ప్రతినిధి పరిమళ నత్వానీ మళ్లీ ఝార్ఖండ్ నుంచి రాజ్యసభకు రానున్నట్లు తెలిసింది. గతంలో రెండు సార్లు ఝార్ఖండ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నత్వానీ ఈసారి బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్లు సమాచారం. ఝార్ఖండ్లో ఖాళీ ఏర్పడిన రెండు సీట్లలో ఒక దానికి జేఎంఎం అధినేత కుటుంబం నుంచి మహిళా సభ్యురాలు పోటీ చేసే అవకాశాలున్నాయి. రెండోసీటును కాంగ్రెస్ ఆశిస్తున్నప్పటికీ ఆ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. రాజ్యసభ సీటుకు ఈ రాష్ట్రంలో 24 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాగా, కర్ణాటకలో కాంగ్రెస్కు దక్కే మూడు రాజ్యసభ సీట్లకు గాను పలుపురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రం నుంచి బీకే హరిప్రసాద్, రాజీవ్ గౌడ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పవన్ ఖేడా, సుప్రియా శ్రీనటే, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.