Share News

కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే వీబీ జీ రామ్‌ జీ : షర్మిల

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:54 AM

కాంట్రాక్టర్లుకు దోచిపెట్టేందుకే కేంద్రం కొత్తగా ‘వీబీ జీ రామ్‌ జీ’ చట్టాన్ని తీసుకువచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే వీబీ జీ రామ్‌ జీ : షర్మిల

శ్రీకాకుళం, రణస్థలం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్లుకు దోచిపెట్టేందుకే కేంద్రం కొత్తగా ‘వీబీ జీ రామ్‌ జీ’ చట్టాన్ని తీసుకువచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ పరిరక్షణ యాత్రలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట, ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో ఆమె పర్యటించారు. ఈ రెండు ప్రాంతాల్లో రచ్చబండ నిర్వహించి స్థానికులతో మాట్లాడారు. ‘పేదల పాలిట సంజీవినిలాంటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, దాని స్థానంలో వీబీ జీ రామ్‌ జీ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ పేరును పథకం నుంచి తొలగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఒక అభినవ గాడ్సే. రూ.80 వేల కోట్లను బడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా ఈ చట్టాన్ని డిజైన్‌ చేశారు. కొత్త చట్టం ప్రకారం 40 శాతం నిధులు రాష్ట్రమే భరించాలి. ఆంధ్రప్రదేశ్‌పై రూ.5 వేల కోట్ల భారం పడుతుంది. రాష్ట్ర హక్కుల కోసం మోదీ కాలర్‌ పట్టుకుంటానన్న జగన్‌... ఇప్పుడు బానిసగా మారిపోయారు. రాష్ట్రానికి హానిచేసే ఇటువంటి చట్టానికి సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మద్దతు తెలపడం సిగ్గుచేటు’ అని షర్మిల విమర్శించారు.

Updated Date - Mar 17 , 2026 | 05:55 AM