6.87 కోట్ల మోసం కేసులో ఎస్బీఐ అధికారి అరెస్టు
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:44 AM
కోట్ల రూపాయల రుణాలను మోసపూరితంగా ఓ వ్యక్తి తన జేబులో వేసుకోవడానికి బ్యాంకు సిబ్బంది సహకారం అందించారనే అభియోగంతో ...
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయల రుణాలను మోసపూరితంగా ఓ వ్యక్తి తన జేబులో వేసుకోవడానికి బ్యాంకు సిబ్బంది సహకారం అందించారనే అభియోగంతో నమోదైన కేసులో ఓ అధికారిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ ఎస్పీ అస్మా ఫర్హీన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2019 జూన్ 15 నుంచి సెప్టెంబరు 4 మధ్య తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం ప్రక్కిలంక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి నుంచి కవల వెంకట నరసింహం అనే వ్యక్తి బ్యాంకు సిబ్బంది సహకారంతో మోసపూరితంగా రూ.6.87 కోట్ల 25 ఏఏబీఎల్ రుణాలను పొందారని బ్యాంకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా అదే బ్రాంచిలో ఫీల్డ్ ఆఫీసర్ కమ్ డిప్యూటీ మేనేజర్(అడ్వాన్సు)గా పనిచేస్తున్న కొవ్వాసి వెంకటరావుదొరను బుధవారం అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించినట్టు అదనపు ఎస్పీ తెలిపారు.