సత్యదేవుడి ప్రసాదం విక్రయ కేంద్రంలో ఎలుకల నివారణకు చర్యలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:19 AM
అన్నవరం జాతీయ రహదారిపై ఉన్న సత్యదేవుడి పాత నమానాలయం ప్రసాదం కౌంటర్లలో ఎలుకల స్వైర విహారంపై దేవస్థానం అధికారులు స్పందించారు.
స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్ల ఏర్పాటు
అన్నవరం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): అన్నవరం జాతీయ రహదారిపై ఉన్న సత్యదేవుడి పాత నమానాలయం ప్రసాదం కౌంటర్లలో ఎలుకల స్వైర విహారంపై దేవస్థానం అధికారులు స్పందించారు. ఎలుకల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. విక్రయ కేంద్రంలో ప్రసాదం గంపలు ఉంచేందుకు స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించిన ర్యాక్లు అమర్చారు. విక్రయ కేంద్రంలో రంధ్రాలన్నింటినీ మూసివేశారు. పైభాగంలో సీలింగ్ చేయించడంతోపాటు హైలామ్ షీట్స్ అమర్చారు. దిగువ భాగమంతా పూర్తిగా ఫ్లోరింగ్ చేసినట్టు దేవస్థానం ఇంజనీరింగ్ విభాగ అధికారులు, ప్రసాదం విభాగ అధికారులు తెలిపారు. ఎలుకలు ప్రత్యక్షమైన పాత నమానాలయ కౌంటర్తోపాటుగా జాతీయ రహదారిపై నూతన నమానాలయ కౌంటర్, తొలిపావంచా వద్దనున్న ప్రసాదం కౌంటర్లను ఈవో త్రినాథరావు ఆదేశాలతో ప్రసాదం విభాగ సూపరింటెండెంట్ రామకృష్ణ, పోల్నాటి లక్ష్మీనారాయణ పరిశీలించారు.