మేం వచ్చాక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం!
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:54 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ వ్యవస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని నియంతల్లా వ్యవహరిస్తున్నారని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమ న్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, లోకేశ్లపై కేసులు పెడతాం
చిప్ దొబ్బంది అనడం కూడా తప్పేనా?: సజ్జల
అమరావతి/విజయవాడ (ఇబ్రహీంపట్నం), ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ వ్యవస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని నియంతల్లా వ్యవహరిస్తున్నారని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమ న్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని, ఇచ్చే రిటర్న్ గిఫ్టుల్లో చంద్రబాబు, లోకేశ్లపై కేసులు ఉంటాయని చెప్పారు. సోమవారం ఆయన పార్టీ నేతలతో కలిసి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లారు. ఆయన్ని పరామర్శించాక మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్లు తుపాకులు పట్టుకున్న సైనికులను ప్రజలపైకి పురిగొల్పేలా నియంతల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. చిప్ దొబ్బింది అనడం కూడా బూతేనా అంటూ ప్రశ్నించారు. బాధితులైన అంబటి, జోగి రమేశ్లపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. అంబటి, జోగి అంశాల్లో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించలేదని, దాడులు జరుగుతుంటే మౌన ప్రేక్షకుల్లా ఉ న్నారని ఆరోపించారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తున్నారన్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో వైసీపీ క్యాడర్ మరింత బలోపేతమైందన్నారు. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొంటామని అన్నారు.