నరసన్నపేటలో ఇంటింటా తాగునీటి కొళాయిలకు భూమిపూజ
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:00 AM
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జల్జీవన్ మిషన్ కింద రూ.9 కోట్లతో ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం శంకుస్థాపన చేశారు.
సత్ఫలితాలిస్తున్న ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’
నరసన్నపేట, జూన్ 20(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జల్జీవన్ మిషన్ కింద రూ.9 కోట్లతో ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం శంకుస్థాపన చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ ఏడాది మార్చి 15న నరసన్నపేట ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ చర్చావేదికను నిర్వహించారు. అప్పట్లో హడ్కోకాలనీ, వంశధార కాలనీకు చెందిన పలువురు మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ప్రధానంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హడ్కో కాలనీకు చెందిన అరుణ కోరారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రమణమూర్తి హామీ ఇచ్చారు. ఈ మేరకు హడ్కో కాలనీ, వంశధార కాలనీలతోపాటు నరసన్నపేట ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించేందుకు జల్ జీవన్ పథకం ద్వారా రూ.9 కోట్లు నిధులతో పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేసి.. ఇంటింటా కొళాయిల ద్వారా తాగునీరు అందజేస్తామని రమణమూర్తి తెలిపారు. దశల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వంశధార కాలనీలో పాఠశాలకు అదనపు భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఈ ఏడాదిలో పాఠశాల భవనాలకు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.