రూ.3.14 కోట్ల విలువైన 598 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:04 AM
మినీ వ్యాన్లో పైన ఖాళీ ప్లాస్టిక్ ట్రేలు, లోపల గంజాయి ఉంచి తరలిస్తుండగా ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పోలీసులు పట్టుకున్నారు.
జంగారెడ్డిగూడెం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మినీ వ్యాన్లో పైన ఖాళీ ప్లాస్టిక్ ట్రేలు, లోపల గంజాయి ఉంచి తరలిస్తుండగా ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు.. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా జీలుగుమిల్లి సీఐ బి.వెంకటేశ్వరరావు, ఎస్సై వి.క్రాంతి కుమార్ సిబ్బందితో గురువారం రాత్రి తాటియాకులగూడెంలోని ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. రాజమండ్రి శివారు బూరుగుపూడి నుంచి మహారాష్ట్రలోని బీడ్ అనే ప్రాంతానికి ఖాళీ ప్లాస్టిక్ ట్రేలను తరలిస్తున్న టాటా డీసీఎం వ్యాన్ను తనిఖీ చేయగా 16 సంచుల్లో సుమారు 598 కిలోల గంజాయి బయటపడింది. దీని విలువ దాదాపు రూ.3.14 కోట్లు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బిజిపూర్ గ్రామానికి చెందిన దిలీ్పకుమార్ మొహంతి, బ్రహ్మపూర్ గ్రామానికి చెందిన జనార్దన్ప్రదాన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ తెలిపారు.