రూ.1.4 కోట్ల విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:11 AM
ఒడిసా నుంచి తీసుకువస్తున్న రూ.1.4 కోట్ల విలువైన 11.44 కిలోల ద్రవరూప గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా...
ఇద్దరి అరెస్టు, మరొకరు పరారీ
చింతపల్లి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఒడిసా నుంచి తీసుకువస్తున్న రూ.1.4 కోట్ల విలువైన 11.44 కిలోల ద్రవరూప గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సీఐ ఎం.వినోద్బాబు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారన్నారు. చింతపల్లి మండలం బలపం పంచాయతీ లమడంపల్లి గ్రామానికి చెందిన బోనంగి మార్క్ తన సోదరుడు బోనంగి జకర్యను లిక్విడ్ గంజాయి కోసం ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ రోళ్లగెడ్డ గ్రామ పంచాయతీకి పంపించాడు. జకర్యతో పాటు లమడంపల్లి గ్రామానికి చెందిన బోనంగి ధనబాబు రోళ్లగెడ్డలో ద్రవరూప గంజాయిని తీసుకొని ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన అన్నవరం ఇన్చార్జి ఎస్ఐ జి.వీరబాబు, సిబ్బందితో లోతుగెడ్డ బ్రిడ్జి సమీపంలో వాహన తనిఖీలు ప్రారంభించారు. వారిని గమనించి జకర్య, ధనబాబు వెనక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. లిక్విడ్ గంజాయి, రెండు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచామని సీఐ తెలిపారు.