కూటమి ప్రభుత్వంతో సీమకు మంచి రోజులు
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:17 AM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాయలసీమకు మంచి రోజులు వచ్చాయని, రెండేళ్లలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
పారిశ్రామికంగా దేశంలో ముందంజ
రైజింగ్ రాయలసీమ సదస్సులోమంత్రులు భరత్, సత్యకుమార్
కడప, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాయలసీమకు మంచి రోజులు వచ్చాయని, రెండేళ్లలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. గతంలో ఎంఓయూ చేసుకుని పట్టించుకునేవారు కాదని, అయితే సీఎం చంద్రబాబునాయుడు ఎంవోయూ చేసుకున్న ప్రతి కంపెనీతో సమీక్ష నిర్వహించి, పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యే వరకు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. శనివారం కడప జిల్లా పరిషత్లో రైజింగ్ రాయలసీమ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్వ్స్మెంట్ పై సదస్సు జరిగింది. సదస్సులో మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, సమర్థ్ కన్వీనర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ కడపలో త్వరలో జేఎస్డబ్ల్యు స్టీలు ప్లాంటు పరిశ్రమ ప్రారంభమవుతుందని తెలిపారు. కడపలోని కొప్పర్తి పారిశ్రామికవాడకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, జిల్లాలో పదివేల కోట్లతో ఏర్పాటుకు పరిశ్రమలతో ఒప్పందాలు జరిగాయని, రాబోయే రోజుల్లో 20 నుంచి 30 వేల కోట్లతో పరిశ్రమలు వస్తాయనిచెప్పారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయన్నారు. దశాబ్దాలుగా కరువు, వలసలతో వెనుకబడిన రాయలసీమను మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు మానవ వనరులు ప్రధాన బలమని తెలిపారు. రాయలసీమను దేశ హరిత రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. కడప జిల్లాలో ప్రత్యేకంగా కొప్పర్తిలో 3 వేల ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కు, పులివెందులలో ఫుడ్ పార్కు, ఎర్రగుంట్ల, కమలాపురం ప్రాంతాల్లో సిమెంటు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో వ్యవసాయాధికారిత పరిశ్రమలు, బద్వేలులో సౌర పరికరాల తయారీకి ప్రణాళిక ఉందని మంత్రి భరత్ వెల్లడించారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సంస్థలకు నాయకత్వం వహించే మేథో సంపత్తి, యువ శక్తి రాయలసీమకు ఉన్న గొప్ప సంపద అని తెలిపార ు. కాలుష్య రహిత వ్యవసాయం, నాణ్యమైన ఉద్యానపంటల ఉత్పత్తిలో రాయలసీమ రైతు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ కడప జిల్లాలో యురేనియం, మంగంపేట బెరైటీస్ సున్నపురాయి., గ్రానైట్ వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉందని, ఇది పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు.