చివరి కోరిక.. తీర్చుకున్నాడిలా..!
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:28 AM
అతనో రిటైర్డ్ ఉద్యోగి. పేరు కుందుర్తి లక్ష్మయ్య. వయసు ఎనభై ఏళ్లు. ఏలూరు జిల్లా నూజివీడు టౌన్లోని హనుమాన్ జంక్షన్ రోడ్డులో.. బొందులి క్షత్రియ శ్మశాన వాటికలో..
Nuzvid Town: అతనో రిటైర్డ్ ఉద్యోగి. పేరు కుందుర్తి లక్ష్మయ్య. వయసు ఎనభై ఏళ్లు. ఏలూరు జిల్లా నూజివీడు టౌన్లోని హనుమాన్ జంక్షన్ రోడ్డులో.. బొందులి క్షత్రియ శ్మశాన వాటికలో కొత్తగా నిర్మించిన అంత్యక్రియల షెడ్డును బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ‘షెడ్డు బాగా నిర్మించారు. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించే తొలి పార్థివ దేహం నాదే అయితే బాగుంటుంది’ అంటూ అక్కడున్నవారికి తన మనసులో మాట చెప్పుకున్నారు. ఈ మాటలు అన్న కొద్దిసేపటికే కూర్చున్న కుర్చీలోంచి ఆయన పక్కకు ఒరిగిపోయారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఆయన కోరిక మేరకు నేత్రాలు దానం చేసి, లక్ష్మయ్య పార్థివ దేహానికి గురువారం ఆ షెడ్డులోనే తొలి అంత్యక్రియలు జరిపారు.
- నూజివీడు టౌన్, ఆంధ్రజ్యోతి