రెరా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనొద్దు: చైర్మన్ శివారెడ్డి
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:44 AM
ఏపీ రెరాలో ఇప్పటి వరకు నిర్మాణదారులు, డెవలపర్లు, కొనుగోలుదారులు వారి ప్రాజెక్టులను నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని ఏపీ రెరా చైర్మన్ శివారెడ్డి కోరారు.
అమరావతి, తుళ్లూరు జనవరి 12(ఆంధ్రజ్యోతి): ఏపీ రెరాలో ఇప్పటి వరకు నిర్మాణదారులు, డెవలపర్లు, కొనుగోలుదారులు వారి ప్రాజెక్టులను నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని ఏపీ రెరా చైర్మన్ శివారెడ్డి కోరారు. సోమవారం సీఆర్డీఏ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన రెరా కమిటీ ఏర్పాటై నాలుగు నెలలైందని, ఈ సందర్భంగా, కొనుగోలుదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ఉమ్మడి 13 జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రెరా అనుమతి లేని వెంచర్లో ప్లాట్లు, ఫ్లాట్లు కొని వినియోగదారులు నష్టపోవద్దని సూచించారు. 2019లో ప్రభుత్వం మారడం, కరోనా పరిణామాల వల్ల చాలా మంది నిర్మాణదారులు, డెవలపర్లు, కొనుగోలుదారులు రెరాలో వారి ప్రాజెక్టులను నమోదు చేసుకోలేదని తెలిపారు. అలాంటివారికి మార్చి 31 వరకు అవకాశం కల్పించామని తెలిపారు. అలాగే, ప్రాజెక్టు పురోగతి గురించి దాఖలు చేసి, క్వార్టర్లీ అప్డేట్స్ సకాలంలో దాఖలు చేయని వారికి కూడా 50 శాతం పెనాల్టీపై దాఖలు చేసే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అథారిటీలో తమ ప్రాజెక్టులను నమోదు చేసుకోని వారు కనీసం ప్రకటనలు ఇవ్వడం గానీ, విక్రయించడంగానీ, అగ్రిమెంట్ చేసుకోవడం గానీ చేయకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపైన ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం పెనాల్టీ విధిస్తామని చైర్మన్ శివారెడ్డి హెచ్చరించారు. డాక్యుమెంటేషన్ అంతా రెరా వెబ్సైట్లో చేసుకోవచ్చన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో కడపలో అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు.