పెండింగ్ పనులకు నిధుల విడుదల చేయండి
ABN , Publish Date - May 02 , 2026 | 11:05 PM
పట్టణంలో నిలిచిపోయిన పెండింగ్ పనులకు నిధులు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు కోరారు.
ఆదోని, మే 2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో నిలిచిపోయిన పెండింగ్ పనులకు నిధులు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు కోరారు. శనివారం అమరావతిలో పలు శాఖల మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎంఎనడీ ఫరూక్ను కలిసి ఆదోనిలో 2014-19 మధ్యకాలంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రారంభానికి నోచుకోని మైనార్టీ ఐటీఐ, ఉర్దూ జూనియర్ కళాశాల, బాలికల రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి చర్చించారు. ఈ విద్యాసంస్థలకు వెంటనే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ను కేటాయించాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కీలక పెండింగ్ పనులకు సంబంధించి నిధుల విడుదలపై మంత్రికి వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు మీనాక్షినాయుడు తెలిపారు. ఆదోని ముస్లీం సోదరులకు త్వరలోనే శుభవార్త అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ముస్లీం మైనార్టీలు పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు.