జనసేన జడ్పీటీసీ జయప్రకాశ్పై కేసు
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:39 AM
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జడ్పీటీసీ, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు అత్యాచారం కేసు నమోదైంది.
ఎస్సీ, ఎస్టీతో పాటు అత్యాచారం కేసు నమోదు
భీమవరం క్రైం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జడ్పీటీసీ, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు అత్యాచారం కేసు నమోదైంది. ఆయనపై ఓ మహిళ ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ ఎస్ఐ కె.రామారావు తెలిపిన వివరాల ప్రకారం... గునుపూడికి చెందిన మద్దాల విజయలక్ష్మి తరచూ పార్టీ కార్యాలయానికి వస్తుండేది. ఏడాది క్రితం జయప్రకాశ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు వివాహమైందని, విడాకులు తీసుకున్నానని ఆమె చెప్పింది. తనకూ వివాహమైందని, భార్యతో దూరంగా ఉంటున్నానని జయప్రకాశ్ చెప్పడంతో ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. మూడు రోజుల క్రితం విజయలక్ష్మి ఒక వీడియో రిలీజ్ చేసింది. తనను శారీరకంగా ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా రూ.10 లక్షల నగదు, కొంత బంగారం తీసుకుని ఇల్లు కొనిస్తానని చెప్పి జయప్రకాశ్ మోసం చేశాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే తనపై ఆరోపణలు అవాస్తవమని జయప్రకాశ్ పేర్కొన్నారు. తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం రాత్రి ఆయనపై కేసు నమోదు చేశారు.