రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:08 AM
రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని ఏలూరు జిల్లా రజక మహాసభ విజ్ఞప్తి చేసింది.
ఏలూరు జిల్లా రజక మహాసభ డిమాండ్
గతంలోనే అసెంబ్లీలో తీర్మానం: మంత్రి పార్థసారథి
నూజివీడు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని ఏలూరు జిల్లా రజక మహాసభ విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన జిల్లా రజక ఆత్మీయ మహాసభలో పాల్గొన్న రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి ఈ మేరకు విన్నవించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ టీడీపీకి బీసీలతో ఉన్న అనుబంధం ఎవరూ విడదీయలేదని పేర్కొంటూ.. గతంలోనే టీడీపీ హయాంలో.. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు గుర్తుచేశారు. జగన్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరగగా కూటమి పాలనలో బీసీలకు జరుగుతున్న మేళ్లను బీసీ వర్గాలు గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తోందని, దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయన్నారు. అయితే, విధ్వంసం తప్ప అభివృద్ధి చేయడం చేతకాని జగన్ ఈ ఫలాలు మనకు దక్కనీయకుండా గోబెల్స్ ప్రచారాలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించి కూటమి ప్రభుత్వానికి భవిష్యత్లో కూడా అండగా ఉండాలని మంత్రి కోరారు.