అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు
ABN , Publish Date - Jan 23 , 2026 | 05:28 AM
క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగమని మంత్రి లోకేశ్ అన్నారు. నైపుణ్యాలు, కొలాబరేషన్ ద్వారా క్వాంటమ్ ఆవిష్కరణలను వేగవంతం చేయడం అనే అంశంపై దావోస్ ఆర్థిక సదస్సులో చర్చ జరిగింది.
తయారీ, ఎగుమతులే లక్ష్యం: లోకేశ్
క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగమని మంత్రి లోకేశ్ అన్నారు. నైపుణ్యాలు, కొలాబరేషన్ ద్వారా క్వాంటమ్ ఆవిష్కరణలను వేగవంతం చేయడం అనే అంశంపై దావోస్ ఆర్థిక సదస్సులో చర్చ జరిగింది. ఈ చర్చలో లోకేశ్ ప్రసంగించారు. 2024లో 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ 2025లో 41 శాతం వృద్ధితో 3.77 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు. ప్రపంచ క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ 41.8 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 2030 నాటికి 20 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. రాజధాని అమరావతిలో జూలై నాటికి దక్షిణాసియాలో మొట్టమొదటి, అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్ 133 క్విట్ హెరాన్ ప్రాసెసర్తో కూడిన ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్-2ను ఐబీఎం, టీసీఎస్ భాగస్వామ్యంతో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. ఇది భారత్లో మొట్టమొదటి డెడికేటెడ్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు కేంద్రమని పేర్కొన్నారు. 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్లోబల్ క్వాంటమ్ ల్యాబ్లతో పరిశోధనా కేంద్రాలు, ప్రముఖ కంపెనీలతో ఉమ్మడిగా పీహెచ్డీ, పోస్ట్-డాక్టోరల్ ప్రోగ్రామ్లు, 50వేలకు పైగా అభ్యాసకుల కోసం క్వాంటమ్ రెడీ స్కిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3 దశల్లో క్వాంటమ్ నైపుణ్య పైప్లైన్ను నిర్మిస్తామన్నారు. ఇది ఉన్నత పరిశోధన ఆవిష్కరణలను కవర్ చేసే ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ తయారీ, ఎగుమతులే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు తెలిపారు.