లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ABN , Publish Date - May 25 , 2026 | 05:07 AM
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆరుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు
కోదాడ, మే 24(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కాకినాడ నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న ఓలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు కోదాడ వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయరహదారిపై ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసం కాగా ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్ తెలిపారు.