నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి రాక
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:41 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి.
విశాఖలో గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న ద్రౌపది ముర్ము
రేపు అనంతపురం జిల్లాలో పర్యటన
న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. మంగళవారం ఉదయం 10.25 గంటలకు ఢిల్లీ నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్పోర్టులో నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రోడ్డుమార్గాన నగరంలోని నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. మధ్యాహ్నం అదే హోటల్లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4.20 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుని 4.30 గంటలకు బెంగళూరుకు బయలుదేరుతారు. బుధవారం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంమండలం జంతులూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగే మొదటి స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఒకవేళ మంగళవారం సాయంత్రం వాతావరణం అనుకూలించకపోతే రాత్రికి ఐఎన్ఎస్ చోళాలో రాష్ట్రపతి బస కోసం ఏర్పాట్లుచేశారు.