Share News

‘డబ్బుల డెన్‌’ కీపర్‌ అరెస్టు

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:52 AM

మద్యం కుంభకోణంలో మరో అరెస్టు.. లిక్కర్‌ కంపెనీల ద్వారా వసూలుచేసిన నోట్ల కట్టలకు కాపలాదారుగా వ్యవహరించిన వ్యక్తిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

‘డబ్బుల డెన్‌’ కీపర్‌ అరెస్టు

  • మద్యం కుంభకోణంలో మరొకరికి సంకెళ్లు

  • నేపాల్‌ సరిహద్దుల్లో కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌ అరెస్టు

  • ఇతను ముప్పిడి అవినాశ్‌రెడ్డికి అనుచరుడు

  • తాడేపల్లిలో డబ్బు డెన్‌కు కీపర్‌గా వ్యవహారాలు

విజయవాడ, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో మరో అరెస్టు.. లిక్కర్‌ కంపెనీల ద్వారా వసూలుచేసిన నోట్ల కట్టలకు కాపలాదారుగా వ్యవహరించిన వ్యక్తిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌ను సోమవారం నేపాల్‌ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. అతడిని ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అక్కడి నుంచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకొస్తున్నారు. ఏసీబీ కోర్టులో మంగళవారం హాజరుపరుస్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డికి ప్రణయ్‌ ప్రకాశ్‌ అనుచరుడు. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. మద్యం కంపెనీల నుంచి లిక్కర్‌ గ్యాంగ్‌ వసూలు చేసిన డబ్బును తాడేపల్లిలోని ల్యాండ్‌మార్క్‌ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో భద్రపరిచారు. వసూలుచేసిన డబ్బుకు ఇది డెన్‌గా ఉండేది. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు డబ్బును ఎన్నికల సమయంలో పంపారు.


ఈ డెన్‌ను ప్రణయ్‌ ప్రకాశ్‌ నిర్వహించేవాడు. మరో నిందితుడు కిరణ్‌కుమార్‌కు ఇతడు స్నేహితుడు. డెన్‌లో ఉన్న డబ్బును చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పిన నియోజకవర్గాలకు పంపేవాడు. ఏ నియోజకవర్గానికి ఎంత మొత్తం పంపాలో దిశానిర్దేశం చేసేవాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రణయ్‌ దుబాయ్‌ పారిపోయాడు. అక్కడ ఉక్కు కర్మాగారం స్థాపించడానికి డీపీఆర్‌ తయారు చేశాడు. చెవిరెడ్డి ఆదేశాలతోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేశాక దుబాయ్‌ నుంచి ప్రణయ్‌ను సిట్‌ అధికారులు పిలిపించారు. వారడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాడు. న్యాయస్థానంలో వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఆ తర్వాతి నుంచి విచారణ గైర్హాజరయ్యాడు. చెవిరెడ్డితో టాంజానియాలో సమావేశమై ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయాణాలు చేశాడు. సిట్‌ అధికారుల నుంచి తప్పించుకోవడానికి థాయ్‌లాండ్‌, టాంజానియా, జింబాబ్వేల్లో తిరిగాడు. తర్వాత ఎక్కడికో పారిపోయాడు. తాజాగా నేపాల్‌ సరిహద్దుల్లో ప్రణయ్‌ ప్రకాశ్‌ ఉన్నట్లు గుర్తించిన సిట్‌ అధికారులు అతడి చేతులకు సంకెళ్లు వేశారు.

Updated Date - Mar 03 , 2026 | 03:53 AM