ఆలయాలే టార్గెట్
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:34 AM
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను ప్రకాశం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4.70 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
ఒంగోలు క్రైం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను ప్రకాశం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4.70 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ హర్షవర్ధన్రాజు శనివారం ఒంగోలులో వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన అనికేత్ కైలాస్ కసరోడ్, సునీల్ దేవరావు, మనీష్గోపాల్ వడివేలుతోపాటు మరో ఇద్దరు బాలురు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. శనివారం ఈ ముఠా అద్దంకి మండలం సింగరకొండ ఆంజనేయస్వామి ఆలయం వద్ద పొలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అద్దంకి రూరల్ సీఐ డి.మల్లికార్జునరావు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు తేలింది. వారిని అరెస్టు చేసి మొత్తం 9 కిలోల వెండి, 19 గ్రాముల బంగారు ఆభరాణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.