రాజకీయ ఘర్షణలతోనే హత్యలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:29 AM
గ్రామాల్లో రాజకీయ విభేదాలు, ఘర్షణలే హత్యలకు దారి తీస్తున్నాయని, పేదలనే బలి తీసుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.
సాల్మన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: మంద కృష్ణమాదిగ
మాచవరం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో రాజకీయ విభేదాలు, ఘర్షణలే హత్యలకు దారి తీస్తున్నాయని, పేదలనే బలి తీసుకుంటున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన సాల్మన్ కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సాల్మన్ది రెండు కులాల మధ్య జరిగిన హత్య కాదని.., రాజకీయ విభేదాలు, ఘర్షణలు తీవ్రరూపం దాల్చడమే ఘటనకు కారణమన్నారు. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండేదని, అక్కడ తగ్గుముఖం పట్టి పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల, గురజాలలో దాడులు ఎక్కువయ్యాయన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి హత్యల నివారణకు పిలుపు ఇవ్వాలని సూచించారు. పోలీసు వ్యవస్థ రాజ్యాంగ పరంగా ధ్రువీకరించబడిందని, వారు అధికారంలో ఉన్న ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే గ్రామాల్లో ఇలాంటి గొడవలకు, హత్యలకు అవకాశం ఉండదని మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. పోలీసులు గ్రామాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకురావాలన్నారు. సాల్మన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.