రూ.98 కోట్లతో పోలవరం రోడ్డు
ABN , Publish Date - May 20 , 2026 | 05:47 AM
పోలవరం నుంచి ప్రాజెక్టుకు రాకపోకలు సాగించేందుకు రూ.98 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి.
ప్రాజెక్టు రాకపోకలకు అనువుగా నిర్మాణం
పోలవరం, మే 19(ఆంధ్రజ్యోతి): పోలవరం నుంచి ప్రాజెక్టుకు రాకపోకలు సాగించేందుకు రూ.98 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. రోడ్డు మార్గం విస్తరణలో భాగంగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. ఏటిగట్టు సెంటర్ నుంచి స్పిల్వే వరకూ ఏడు కిలోమీటర్ల మేర ఏటిగట్టు మళ్లింపు రోడ్డు ఏడు మీటర్ల వెడల్పున రెండు లేన్లుగా నిర్మించనున్నారు. కడమ్మ స్లూయిజ్ వరకూ కిలో మీటరు సీసీ రోడ్డు నిర్మిస్తారు. కడమ్మ స్లూయిజ్ వద్ద వాహనాలు రాకపోకలు సాగించేందుకు విశాలమైన మరో కొత్త బ్రిడ్జి నిర్మాణంతో పాటు ప్రాజెక్టు మార్గంలో మరో రెండు మైనర్ బ్రిడ్జిలు, 20 కల్వర్టుల నిర్మాణం జరగనుంది. ఈ రోడ్డు నిర్మాణంతో పోలవరం ప్రాజెక్టు పర్యటన, ఐకానిక్ బ్రిడ్జి సందర్శనకు అనువుగా ఉంటుందని, పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్ఈ రామచంద్రరావు, ఈఈ పి.వెంకటరమణ తెలిపారు.