పోలవరం రెండోదశకు 32 వేల కోట్లు అవసరం
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:54 AM
పోలవరం ప్రాజెక్టు రెండోదశ పూర్తికి రూ.32,000కోట్లు కావాలని రాష్ట్రప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు నివేదికను సిద్ధం చేసింది. జలవనరుల శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్..
కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న రాష్ట్రప్రభుత్వం
1న ఢిల్లీలో జలశక్తి కార్యదర్శిని కలవనున్న సీఎస్ సాయిప్రసాద్
అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు రెండోదశ పూర్తికి రూ.32,000కోట్లు కావాలని రాష్ట్రప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు నివేదికను సిద్ధం చేసింది. జలవనరుల శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ దీనిని మే 1న ఢిల్లీలో జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావుకు సమర్పించనున్నారు. వాస్తవానికి ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తున 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేందుకు కేంద్రమే డిజైన్ చేసి డీపీఆర్లు రూపొందించింది. వీటికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆమోదముద్ర వేసింది. 2019లో సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన జగన్.. పోలవరం ప్రాజెక్టును రెండుదశల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. తొలిదశలో 41.15 మీ. కాంటూరులో 115 టీఎంసీలు నిల్వ చేయాలని.. రెండోదశలో 45.72 మీ. కాంటూరులో గరిష్ఠంగా 194.6టీఎంసీలు నిల్వ చేయాలన్న ప్రతిపాదనలు కేంద్రం ముందుంచారు. అయితే ఆయన తొలిదశ పూర్తికే మొగ్గుచూపి.. రెండో దశ భూసేకరణ, నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, సహాయపునరావాస కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశారు. దీంతో కేంద్రం పోలవరం రెండోదశపై మౌనం వహించింది. పునరావాసం కల్పించడం తమ బాధ్యత కాదన్నట్లు వ్యవహరించింది. 2024లో కూటమి అధికారపగ్గాలు చేపట్టాక.. పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టే పనులు వేగవంతం చేసింది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయింది. ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు ప్రారంభమయ్యాయి.
ఈ పనులు వచ్చే ఏడాది జూన్ నాటికే పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణంపై 2024 తర్వాత కేంద్రం వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ఇంతకాలం 45.72 మీటర్ల కాంటూరులో భూ సేకరణ, పరిహారం చెల్లింపుపై తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది. సీఎం చంద్రబాబు వినతులపై స్పందించి.. ఇప్పుడు రెండో దశపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే గత నెలలో పోలవరం ప్రాజెక్టును జలశక్తి కార్యదర్శి కాంతారావు సందర్శించారు. వడివడిగా జరుగుతున్న పనులను పరిశీలించారు. తర్వాత గతనెల 25న సీఎస్ సాయిప్రసాద్ ఢిల్లీ వెళ్లి కాంతారావును కలిశారు. రెండో దశను పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన హామీఇచ్చారు. కేంద్రం చొరవతో సీఎం చంద్రబాబు సంతోషంగా ఉన్నారు. రెండోదశ పూర్తికి అవసరమైన నిధులు, ఇతర వివరాలను తనకు పంపాలని సీఎంవో జలవనరుల శాఖను ఆదేశించింది. దీంతో ఆ శాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. రెండో దశలో సహాయ పునరావాసం, భూసేకరణకు (41.15 మీటర్ల కాంటూరు నుంచి 45.72 మీటర్ల కాంటూరు దాకా) రూ.21 వేల కోట్లు, ఒడిసా, ఛత్తీస్గఢ్ లలో రక్షణ గోడల నిర్మాణానికి రూ.1350 కోట్లు, ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కాలువల నిర్మాణానికి రూ.5400 కోట్లు, ప్రాజెక్టులో నావిగేషన్ కోసం రూ.4350 కోట్లు అవసరమని పేర్కొంది. సీఎస్ ఈ వివరాలను ఒకటో తేదీన కాంతారావుకు సమర్పించి చర్చిస్తారు. గత నెలలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా ఈ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా కేంద్రం కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి.