ఓటరు జాబితా సవరణకు సహకరించాలి
ABN , Publish Date - May 21 , 2026 | 11:56 PM
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్ట నున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదోని నియోజకవర్గ సబ్ కలెక్టర్, ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన్ అధికారి వై.మధుసూదన్రెడ్డి కోరారు.
సబ్ కలెక్టర్ వై. మధుసూదనరెడ్డి
రాజకీయ పార్టీల
ప్రతినిధులతో సమావేశం
ఆదోని, మే 21 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్ట నున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదోని నియోజకవర్గ సబ్ కలెక్టర్, ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన్ అధికారి వై.మధుసూదన్రెడ్డి కోరారు. గురువారం సబ్కలెక్టర్ కార్యాలయంలో వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సబ్కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ షెడ్యూల్, పోలింగ్ స్టేషన్ల యుక్తీకరణ (రేషనలైజేషన్), పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కారం, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ వంటి అంశాలపై ప్రతినిధులతో సమగ్రంగా చర్చించారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఏజెంట్లను నియమించండి
ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా భాగస్వాములు కావాలని సబ్కలెక్టర్ సూచించారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ స్టేషన్కు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో సరి చూసుకోవాలన్నారు. పేరు నమోదు, మార్పులు, చేర్పులు లేదా తొలగింపుల కోసం సంబంధిత బూత్లెవెల్ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్లు శేషఫణి, బాబు, తిమ్మక్క, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.