ప్రభుత్వంపైనే ప్రజల ఆశలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:04 PM
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపధ్యంలో రాయలసీమ ప్రజలు ప్రభుత్వంపై ఆశగా చూస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు అన్నారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు
నంద్యాల ఎడ్యుకేషన, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపధ్యంలో రాయలసీమ ప్రజలు ప్రభుత్వంపై ఆశగా చూస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు అన్నారు. ఆదివారం బొజ్జా దశరధరామిరెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు తాగునీటిని అందిస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం రాయలసీమ ప్రాజెక్టులకు రూ.60వేల కోట్లు నిధులు కావాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమకు ఈ ఏడాది రూ.8వేల కోట్లను కేటాయించాలని కోరారు. ఇందులో ప్రత్యేకంగా రూ.1250కోట్లు ఆయకట్టు అభివృద్ధికి ఖర్చుపెడితే ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని సూచించారు. ఎస్సార్బీసీకి ప్రాణాధారమైన గుండ్రేవుల రిజర్వాయర్కు రూ.500 కోట్లు కేటాయించి పూర్తిచేయాలని కోరారు. బనకచర్ల నుంచి రాయలసీమకు హక్కుగా ఉన్న 4 టీఎంసీల నీటిలో ఒక్క టీఎంసీ నీటిని కూడా తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు టీఎంసీలు కుందూనదిలో పోవడమో లేదా నెల్లూరు వైపు వెళ్లి సముద్రంలో కలవడమో లేదా అత్యధిక నీటిని ఎస్సార్బీసీకి మళ్లించడంతో రాయలసీమలో ఉన్న పంట పొలాలు మునిగిపోవడమో జరుగుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును రక్షించుకోవడం కోసం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.